ప్రశ్న కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్తావ్ అసమానతలఫై అంతం లేని పోరాటం ఎంతకాలం చేస్తావ్ అందరి స్వేచ్ఛ కోసం కలగన్న జాతి రత్నమా మా ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్
దేవదాసి విధానాన్ని నిర్ములించడం కోసం స్త్రీ సమాజ ఆభివ్రిద్ది కోసం బతుకంతా ఆత్మగౌరవ ఉద్యమంగా మల్చుకున్నవాడా శ్రమైక జీవన సౌందర్యం కోసం నిరంతర ఘర్షణ పడ్డవాడా జీవిత సత్యాల సఫలత్వం కోసం రాజీలేని పోరు జరిపినవాడా దోపిడీ, పీడనల ఫై ఉరిమినవాడా రచనని, మేధని అట్టడుగుజనం విముక్తి కోసం వినియోగించినవాడా ఉద్యమాన్ని మానవత్వ శిబిరంగా ఎగరేసినవాడా మూఢ విశ్వాసం బ్రాహ్మణిజం, పురుషాధిక్యత లేని లోకం కోసం పరితపించినవాడా ప్రతి అణచివేతని ధిక్కరించినవాడా.. మా పెరీయారు ..నీకూ దండాలు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యావజ్జీ వితం నిమ్న జాతుల అస్తిత్వం కోసం,
ఆత్మగౌరవం కోసం, వారికి పరిపాలనలో భాగం కోసం పోరాటం చేశారు. బాల్యం నుంచి
అనేక సందర్భాల్లో, ఎన్నో నిందలు, అవమానాలు పొంది, అగ్నిశిఖలా ఎగిసిన ప్రపంచ
స్థాయి మేథావి ఆయన. మనుధర్మాన్ని చీల్చి చెండాడి, కులం యొక్క వివక్ష
విశ్వరూపాన్ని అనేక పార్శ్వాల్లో ఆవిష్కరించిన తత్త్వవేత్త. భారతదేశం
గురించి విశేష పరిశోధన చేసిన దార్శనికుడు. దార్శనికతతో ఆయన చేసిన కృషి
అనితర సాధ్యం. రాజ్యాంగ నిర్మాతగా, రిజర్వేషన్ సాధించిన మహనీయునిగా ఆయన
గురించి జరిగినంత ప్రచారం, మిగతా అంశాల్లో జరగలేదు. ఆయన 'ప్రాతినిధ్యం'
అన్న పదాన్ని మాత్రమే వాడారు తప్ప 'రిజర్వేషన్స్' అనే పదం వాడలేదు. జీవిత
చరమాంకంలో బౌద్ధమతాన్ని స్వీకరించి, బుద్ధుని యెడల తన దృక్పథం మహాయానం,
హీనయానం కాదని, 'నవయానం' అని ధైర్మంగా చాటిన బౌద్ధ భిక్షువు అంబేద్కర్. ఆయన
125వ జయంతిని ఈ ఏడాది దేశమంతటా ఘనంగా జరపాలని అనేక సంస్థలు భావించి తమదైన
శైలిలో నివాళ్లర్పిస్తున్నాయి. ప్రజానాట్య మండలి, తెలంగాణ రాష్ట్ర శాఖ
'సంఘం శరణం గచ్ఛామి' పేరిట ఒక కళారూపాల కదంబాన్ని ప్రదర్శిస్తోంది. 25 మంది
కళాకారులతో ప్రొడక్షన్ క్యాంప్ నిర్వహించి తొలి ప్రదర్శనను ఏప్రిల్ 14న
హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో కిక్కిరిసిన ప్రేక్షక సందోహం
మధ్య ఇచ్చారు. 21 సీన్లతో, 13 పాటలతో ఈ సంగీత రూపకాన్ని రచించారు
ప్రజాకవి 'దేవేంద్ర'. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్డిఎం.రాజు వాయిస్
ఓవర్తో, సంగీత దర్శకులు ఇస్మాయిల్ గోనాల్ స్వరకల్పనలో, రవి కల్యాణ్
సంగీత సారథ్యంలో అన్ని పాటలూ సిడి రూపంలో రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్
సెంట్రల్ యూనివర్శిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్కి చెందిన శివప్రసాద్ తూము
దర్శకత్వం వహించారు. ఈ రూపకాన్ని గంటసేపు ఆద్యంతం రసవత్తరంగా
ప్రజాకళాకారులు ద్రర్శించారు. రూపకం ప్రారంభంలో ... అంబేద్కర్
విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతూ ఉంటాయి. నిర్వాహకుడొకరు వచ్చి ఆశీనులైన
ప్రేక్షకులతో - జరగబోయే కార్యక్రమాన్ని వివరించి కళాకారులను ఓ పాటను
అభినయించమంటారు. కళాకారుల ప్రదర్శన సాగుతుండగా, ప్రజా ప్రతినిధులు రావడంతో
మధ్యలో ఆపేయమంటారు నిర్వాహకులు. సణుక్కుంటూ వేదిక దిగుతారు కళాకారులు.
విగ్రహావిష్కరణకు ముందు ఉపన్యాసాలు సాగుతాయి. ముఖ్య అతిథి అయిన మంత్రి వేరే
పనుండి గాబట్టి- రెండే మాటలు మాట్లాడతానంటూ 'అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు,
రిజర్వేషన్లు తెచ్చాడు, మిగిలినవి ఎన్ని చేసినా ఇవే ముఖ్యమైనవి..' అంటాడు.
విగ్రహానికి దండ వేసి నినాదాల హౌరుతో శిరస్సు వంచి ఓ నమస్కారం చేస్తాడు.
అంబేద్కర్ విగ్రహానికి జీవం వచ్చి, రాజ్యాంగం పుస్తకంతో మంత్రి నెత్తి మీద
తడతాడు. అందరూ ఉలిక్కి పడతారు. అంబేద్కర్ దండను నినాదాలిస్తున్న
కార్యకర్తలకు అందించి- గంభీరంగా మెట్లు దిగుతాడు. రాజ్యాంగాన్ని
టేబుల్పై పెట్టి- ఇలా మాట్లాడతాడు : 'అరవై ఏళ్లుగా విన్న మాటలే వినీ మళ్లీ
మళ్లీ విని చెవులు దిబ్బళ్లు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా
మార్చేశారు. నేను ఈ దేశంలో నోరులేని వాళ్లకు నోరై పోరాడాను. పీడితుల కోసం,
అణగారిన వర్గాల, మైనార్టీల అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి,
చెప్పినవి, రాసినవి వదిలేసి- నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే
'రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్ తెచ్చాడు' అంటూ ఇంకా ఎన్నేళ్లు చెబుతారు?
ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేను ఆవిష్కరించుకోవాలి..
దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికలను ఆవిష్కరించుకోవాలి.' అంటూ
ముందుకు వస్తాడు. అప్పుడు ... 'యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్ తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్ నరాల సత్తువ వరాల వానకు విషాద రాగపు సువర్ణ వీణ అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తినిచ్చే స్ఫూర్తుల వాన' అంటూ రూపకం మొదలై ... దాదాపు గంటసేపు అవిశ్రాంతంగా నడుస్తుంది బాల్యం,
పేదరికం, తండ్రి మరణం, బరోడా మహారాజు ఆర్థిక సహాయం, అమెరికా పయనం,
రమాబాయితో వివాహం, అర్థంతరంగా చదువు వదిలి స్వదేశాగమనం, బహిష్క ృత
హితకారిణీ సంస్థ, సమాజ సమతాదళ్ ఏర్పాటు, చౌదార్ చెరువు సంఘటన, సవర్ణులపై
చారిత్రాత్మక విజయం, మనుధర్మ పుస్తకం అగ్నికి ఆహుతి చేయడం, అంబేద్కర్,
గాంధీల సమావేశం, చర్చలు విఫలమవ్వడం, పూనే ఒప్పందం, ఎరవాడ జైల్లో గాంధీతో
భేటీ, రమాబాయి మరణం, కుల నిర్మూలన పుస్తక రచనకు మూలం, రాజ్యాంగ పరిషత్
ఆవిర్భావం, న్యాయ శాఖామంత్రి పదవీ స్వీకరణ, హిందూ కోడ్ బిల్లు వల్ల
మహిళలకు అన్యాయంలో రాజీనామా; రాజ్యాంగ రచన, బౌద్ధమత స్వీకరణ తదితర జీవిత
ఘట్టాలను వివరిస్తూ ... సాగుతోంది రూపకం. ఆడియో అంతా ముందే రికార్డు
అవ్వడం వల్ల కళాకారుల వాచికాభినయానికి అంత అవకాశం లేదు. ఏ ప్రాంత
కళాకారులైనా రూపకాన్ని సిడి సహాయంతో ప్రదర్శించవచ్చు. సురభి టెక్నీషియన్స్
సహాయంతో సెట్టింగ్ చాలా సింపుల్గా నిర్మించారు. వాయిస్ ఓవర్, పాటలలో
ఎక్కడా ఆగకుండా నడిచే ఈ రూపకంలో ఇద్దరు అంబేద్కర్ పాత్రధారులు ఉన్నారు.
విగ్రహం రూపంలో ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.జగ్గరాజు నటించగా- కథనంలో మరో
నటుడు నటించారు. 20 సీన్ల కథనం తర్వాత అంబేద్కర్ విగ్రహంతో ఆఖరి సీన్
వస్తుంది. 'జయంతులు, వర్థంతులు అంటూ రెండు రోజులు మాత్రమే గుర్తుంచుకుని,
మిగతా 363 రోజులూ విస్మరిస్తారా? తాను ఏ ఆశయంతో పోరాడాడో వాటి గురించి
పోరాడేది ఎవరు? నెరవేర్చేది ఎవరు? నాయకులైన మీరేనా?' అని అడగగా రాజకీయ
నాయకులు మౌనంగా ఉండిపోతారు. అక్కడ ఉన్న యువత, 'మేమున్నాం అంబేద్కర్' అంటూ
ముందుకు వస్తారు. అంబేద్కర్ వారందరినీ తల నిమురుతూ కౌగిలించుకుంటూ,
గంభీరంగా పీఠం మీదకు వెళ్లి శిలగా మారిపోతాడు. యువతీయువకులు తమ చేతిలోని
దండను అంబేద్కర్ విగ్రహానికి వేసి- 'అంతమెరగని స్వాతంత్య్రానికి, కులమత
భేదం దరికి చేరని ఆధిపత్యాలు వివక్షతలు దుంప నాశనం చేసేవరకూ .... కదిలింది
యువత- నిర్మించగ సుందర భవిత' అంటూ గానంతో రూపకం ముగుస్తుంది. ఈ రూపకంలో
కొన్నిచోట్ల ఉపన్యాసంగా అన్పించినా, ఒక జీవిత కాలాన్ని ఒక్కగంటలో
చెప్పేటప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఈ రూపకంలో అంబేద్కర్ మొదటి
భార్య రమాభాయి గొప్పదనాన్ని ఎంతో హృద్యంగా; మరణాన్ని ఎంతో విషాదపూరితంగా
చూపారు. ఆమె మరణం తర్వాత 11 ఏళ్ల అనంతరం, అప్పటికే అనేక అనారోగ్య సమస్యలు
ఎదురై, ఒంటరితనంతో ఉన్న అంబేద్కర్ జీవితంలోకి రెండో భార్యగా డాక్టర్
సవితాదేవి వచ్చారు. రాజ్యాంగ రచనా సమయంలో, అంబేద్కర్ అవసాన దశలో
కంటిరెప్పలా చూసుకున్నారు. ఆమె ప్రస్తావన ఎక్కడా రాకపోవడం లోపంగానే
భావించాలి. ఈ రూపకం ఉన్న పుస్తకం, రూపకంతో పాటు మరో 14 పాటలు
పొందుపరచిన డివిడిని కలిపి రూ.100లకు అందిస్తున్నారు. వాటికోసం తెలంగాణా
రాష్ట్ర థియేటర్ సబ్ కమిటీని సంప్రదించవచ్చు. పుస్తకానికి ముందుమాట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు రాశారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు తమ సందేశం
ఇచ్చారు. - డాక్టర్ శమంతకమణి 94919 62638 ప్రజాశక్తి ( ) సౌజన్యం తో
అంబేడ్కర్
భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించారు. దేశం నుంచి నిష్క్రమించిన
బౌద్ధాన్ని తిరిగి ప్రతిష్టించాలని ప్రగాఢంగా ఆకాంక్షించారు. బౌద్ధాన్ని
అంబేడ్కర్ విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి బౌద్ధం వైపు చూస్తోంది.
‘పీడిత
కులస్థులు ఎప్పుడూ తమ అస్తిత్వ పునాదులపై నిలబడి పోరాడాలి తప్ప ఆధిపత్య
మతాలలోకి కాందిశీకులుగా వెళ్ళకూడద’ని తమిళ దళిత బౌద్ధ ఉద్యమకారుడు పండిత
అయోతీదాస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బౌద్ధాన్ని
స్వీకరించడానికి దశాబ్దాల ముందే అయోతీదాస్ ఈ సత్యాన్ని చెప్పారు. అంబేడ్కర్
బౌద్ధాన్ని స్వీకరించడం భారతదేశ బౌద్ధ మత చరిత్రలోనే ఓ కీలకమైన అధ్యాయం.
బౌద్ధాన్ని ఇతరులు అర్థం చేసుకునే విధానానికీ అంబేడ్కర్ పరిశీలించిన
పద్ధతికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. గాంధీ, వివేకానంద, సర్వేపల్లి
రాధాకృష్ణన్ వంటి వారు బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణిస్తారు. కానీ
అంబేడ్కర్, బుద్ధుడిని బ్రాహ్మణ వాదాన్ని సవాల్ చేసి బ్రాహ్మణేతర తాత్విక
ధోరణిని ప్రవేశ పెట్టిన సామాజిక విప్లవకారుడిగా పరిగణిస్తాడు. అంతేకాదు
సామాజిక విప్లవంగా ముందుకొచ్చిన బౌద్ధాన్ని అంతమొందించి దాని స్థానంలో
హిందూ మతాన్ని, దానికి అనుబంధంగా కులవ్యవస్థను స్థిరీకరించి, సామాజిక
అంతరాలను చట్టబద్ధం చెయ్యడానికి బ్రాహ్మణవాదులు చేసిన ప్రయత్నాలను
‘ప్రతీఘాత విప్లవం’ గా అంబేద్కర్ అభివర్ణించారు.
ప్రాచీన
కాలంలో వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, దేవుడి ప్రధానంగా కాక నైతికత
ప్రధానంగా ముందుకొచ్చి, ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రచారం చేసిన గౌతమ
బుద్ధుడు తన గురువుల్లో ఒకరుగా అంబేడ్కర్ ప్రకటించారు. అలాగే స్వేచ్ఛ,
సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన భావాలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి
కాక బౌద్ధం నుంచి గ్రహించినట్లు అంబేడ్కర్ చెప్పుకున్నారు. ఇతర మత
ప్రవక్తలందరూ తాము దేవుని కుమారులమని, దేవదూతలమని, తామే దేవుళ్ళమని
ప్రకటించుకుంటే బుద్ధుడి ధర్మంలో దేవుడికి స్థానం లేదని అంబేడ్కర్ అంటారు.
బుద్ధుడు మనిషి నైతిక ప్రవర్తనను ఉన్నతంగా చేసే విధంగా తన సిద్ధాంతాన్ని
రూపొందించాడని, ఆ కారణంగానే తాను బౌద్ధాన్ని అభిమానించినట్లు అంబేడ్కర్
చెప్పారు.
తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా
మాత్రం మరణించనని యోలా సభలో ప్రకటించాడు. అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న
నాగపూర్లో తన లక్షలాది సహచరులతో బర్మా దేశానికి చెందిన భిక్షువు చంద్రమణి
చేతుల మీదుగా బౌద్ధాన్ని స్వీకరించి మరో సామాజిక విప్లవానికి నాంది
పలికారు. అంబేద్కర్ తన దీక్ష అనంతరం మరుసటి రోజు అదే స్థలంలో తానే స్వయంగా
తన సహచరులకు దీక్షనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో త్రిశరణాలతో పాటు మరో
22 ప్రమాణాలు చేయించారు. క్రైస్తవ మతానికి బైబిల్ వున్నట్లు బౌద్ధ ధర్మ
సారాంశాన్ని ఒక గ్రంథంగా రూపొందించాలని ఆయన చేసిన కృషి ‘బుద్ధ అండ్ హిస్
ధమ్మా’ పేరుతో ఆయన మరణానంతరం వెలుగు చూసింది.
బుద్ధుడి
జీవితం, బోధనలపై సంప్రదాయవాదులైన బౌద్ధ పండితులు విశ్లేషించే పద్ధతికి
భిన్నంగా అంబేద్కర్ బౌద్ధాన్ని ఈ పుస్తకంలో విశ్లేషించాడు. ఇతర మతాలలోని
సన్యాసులవలే కాకుండా బౌద్ధ బిక్షువులు సమాజంలో క్రియాశీలక కార్యకర్తలుగా
ఉండి, బుద్ధుడి సందేశమైన బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని
సూచించారు. ఆయన ఈ పుస్తక రచనలో చరిత్ర, మానవ శాసా్త్రల విశ్లేషణా పద్ధతులను
పాటించారు. తన దీక్ష సందర్భంగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా
తనదైన బౌద్ధానికి ‘నవయానం’ అనే పేరును అంబేడ్కర్ సూచించారు. భారతదేశంలో
తనకంటే ముందు బౌద్ధాన్ని బ్రాహ్మణేతర దృక్పథం నుంచి పరిశీలించిన ప్రొఫెసర్
లక్ష్మీనరుసు రచించిన ‘ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం’ అనే పుస్తకానికి పీఠిక
రాసి 1948లో తిరిగి ముద్రించారు. బుద్ధుడిని హిందూమతంలో భాగం అనుకొనే
రోజుల్లో ప్రజల భ్రమల్ని తొలగించే మంచి పుస్తకంగా లక్షీనరుసు గ్రంథాన్ని
అంబేడ్కర్ పేర్కొన్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా అటువంటిదే!
అంబేడ్కర్ భారతదేశాన్ని బౌద్ధదేశంగా పరిగణించి బ్రాహ్మణ వాదుల ప్రతీఘాత
విప్లవంతో దేశం నుంచి నిష్క్రమించిన బౌద్ధాన్ని తిరిగి ఇక్కడ
ప్రతిష్టించాలని కలగన్నారు. ‘భారతీయత’ అనేది బౌద్ధంలోనే ఉందని చెప్పడానికి
ఆయన రాజ్యాంగ రచనను ఉపయోగించుకున్నారు. బౌద్ధ చిహ్నాలైన అశోకుడి సారనాథ్
స్తంభాన్ని, ధర్మచక్రాన్ని ఈ దేశపు చిహ్నాలుగా రాజ్యాంగంలో పేర్కొన్నారు.
‘పంచశీల’ భావన కూడా బౌద్ధం లోనిదే. రాజ్యాంగ రచనలోనూ, హిందూకోడ్ బిల్లును
తయారు చెయ్యడంలోనూ అంబేడ్కర్ పైన బౌద్ధ ధర్మ ప్రభావం కనిపిస్తుంది.
అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అంబేడ్కర్ ‘బుద్ధ ఆర్ కార్ల్మార్క్స్’ అనే పుస్తకంలో కార్ల్ మార్క్స్
సోషలిజం కంటే బుద్ధుడు ప్రతిపాదించిన అహింసాయుతమైన సమానత్వ భావన గొప్పదని
పేర్కొనడం, బౌద్ధ ధర్మ దీక్ష తీసుకోవడంపైన మార్క్సిస్టులు ఆయన పై తీవ్ర
అసంతృప్తి చెందారు.
అంబేడ్కర్ బౌద్ధం పై చేసిన
లోతైన పరిశోధన, ఆయన బౌద్ధాన్ని విశ్లేషించిన తీరు వలన ప్రపంచం తిరిగి
బౌద్ధం వైపు చూస్తున్నది. మహారాష్ట్రలో బౌద్ధాన్ని అవలంబించే దళితులు
అంబేడ్కర్ అనంతరం గతంలోని తమ కులపరమైన గుర్తింపును వదిలిపెట్టి ‘నియో
బుద్ధిస్ట్’ అనే సామాజిక గుర్తింపును పొందారు. దళితుల రాజ్యాధికారం అనేది
వారి బౌద్ధమత గుర్తింపు ద్వారానే సాధ్యమవుతుందని అంబేడ్కర్ వాదులు
భావిస్తున్నారు. సామాజిక, రాజకీయ రంగాలలో దళితుల పరాధీనత అనే సమస్యకు
అంబేడ్కర్ బౌద్ధంలో పరిష్కారాన్ని వెదికినట్లే హిందూ సామ్రాజ్య వాదానికి
బౌద్ధం సమాధానం చెప్పగలదని భావిస్తున్నారు. ఆయన బౌద్ధ ధర్మదీక్ష ఈ దేశంలో
సాంస్కృతికరంగంలో ఫాసిస్ట్ అణచివేతకు గురవుతున్న హైందవేతరులందరికి
స్ఫూర్తిదాయకం.
చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి నేటికి యాభయ్యేళ్లు)
నాదం,
రాగం, లయ, మ్యూజిక్, ఫ్రీక్వెన్సీ, వేవ్లెన్త్ అన్నీ సైన్సే! ఇవన్నీ
శరీరంలో ఎముకల లాంటివి. లోన ఉన్నవాటిని గమనించం. కండ, చర్మం చూసి అందం
బేరీజు వేస్తాం. ఎలక్ట్రిక్ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్ పోతే
బల్బు పనికిరాదు. ఫిలమెంట్ సైన్స్ ప్రిన్సిపల్ మీద తయారయ్యింది. గాజు
బల్బూ సైన్సు వల్ల వచ్చిందే. మనవాళ్లు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి
ఇంజనీరింగ్ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి,
శక్తిని... వారి మహత్మ్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే
పరవశించిపోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా
ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా?
మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ
మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో
దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం... మనిషి
ఆత్మవిశ్వాసం దెబ్బతీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు,
తరతరాలకు ఆ జాడ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచాల పేరుతో
కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతిలోని
విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి
ఏమాత్రం సరిపడని విషయాలు కదా?
మన రోజువారీ సంభాషణల్లో 'అంతా దేవుడిదయ' -
'అంతా పైవాడు చూసుకుంటాడు' - 'ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు' లాంటి మాటలు
వింటూ ఉంటాం. ఏమీ తెలియని పసిపాపలకు 'జేజకొడతాడు దండం పెట్టు' - 'జేజ
తీసుకు పోయాడు' - 'దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది' లాంటి మాటలు పసితనంలోనే
నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు / మరణిస్తాడు. కానీ
ఆధ్యాత్మిక గురువులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు. చచ్చాడని గౌరవంగా చెప్పడం...
అంతే, జీవశాస్త్రపరంగా ఏ చావైనా ఒకటే! ఇంతెందుకూ నాస్తిక, హేతువాద
సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు
పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలు పెడుతూ, పెడుతూ ఉండగా
వచ్చినవి. నా ఇంటిపేరులో కూడా దేవ శబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది
కాదు.
ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు
అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా - అంటే లేదు.
కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని
గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
మతరహిత ప్రజలు దేశాల
వారిగా ఈ విధంగా ఉన్నారు. ఎస్తోనియా-76.5శాతం, జపాన్-76శాతం;
డెన్మార్క్-72 శాతం; స్వీడన్-64శాతం; వియత్నాం-62,5 శాతం;
మకాల్-60.9శాతం; జెక్ రిపబ్లిక్-57.5శాతం; హాంకాంగ్- 57శాతం;
ఫ్రాన్స్-53.5శాతం; నార్వే-51.5శ ాతం, చైనా-47శాతం; నెదర్లాండ్-47శాతం;
ఫిన్లాండ్-44 శాతం; ఇంగ్లాండు-41.5శాతం; దక్షిణ కొరియా-41శాతం;
జర్మనీ-40శాతం; హంగరి-39శాతం; బెల్జియం-38.75 శాతం; బల్గేరియా 37శాతం;
సోమేనియా-36.15శాతం; న్యూజిల్యాండ్-34.7శాతం; రష్యా-30.5శాతం; అమెరికా-
20శాతం. ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా ఎంత అని ఆతురతగా వెతుక్కునే వారి
కోసం ఇక్కడ ఇస్తున్నాను. భారతదేశంలో మతరహిత ప్రజలు 0.6శాతం. ఈ వివరాలన్నీ
ఇవ్వడం ఎందుకంటే ప్రపంచదేశాలలో మనమెక్కుడున్నామన్నది బేరీజు వేసుకోవడానికి!
దేవుడు-దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల
కొనసాగింపులోంచి బయటపడి, ఇకనైనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన
చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి!! నవంబర్ 6, 2015న 'ద గార్డియన్'
ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది. ''మత రహిత సంస్కృతి, ప్రజాస్వామిక
వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా
మూసేస్తున్నారు. అంతే కాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే.. మతాన్ని
ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినప్పుడు... వీరి కంటే మతరహిత కుటుంబాల
పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది.
అంటే, 'దేవుడున్నాడు అన్న భావన ప్రజల్ని నైతికంగా మంచి దారిలో ఉంచుతుంది'
అన్న వాదనకు ఈ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
ఈ కాలంలో తెలివి తేటల్ని
ఐక్యూ లెవెల్స్తో కొలుస్తున్నాం. ఐక్యూ అంటే ఇంటిలిజెంట్ క్వొటియెంట్
లెవెల్స్. ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో నమ్మనివారిలో ఎలా ఉన్నాయి అనే
పరిశీలన జరిగింది. దాని ఫలితం ఏమొచ్చిందంటే నాస్తికుల ఐక్యూ లెవెల్స్
115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది. అదే ఆస్తికుల
విషయానికొస్తే అది 85-115 మధ్య ఉంది. మరికొందరిలో ఇంకా తక్కువగా 75 మాత్రమే
ఉంది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి గనక లెక్కగడితే, 90శాతం
మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది. ఆపైన ఉన్నవారు 5శాతమైతే, 85కు తక్కువ మరో
5శాతం మంది ఉన్నారు. దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది. దైవభ్రాంతి,
దైవచింతన, దైవభక్తి లేదా దేవుడంటే భయపడే జనాభా ప్రపంచంలో అధికంగా ఉంది.
మనిషి సృష్టించుకున్న అతి భయంకరమైన భావన ఏమిటంటే అది దేవుడే. అందులోంచి
బయటపడాల్సింది మనిషే. ఖండాంతరాలను అధిగమించిన మానవుడు, పర్వతాలను దాటిన
మానవుడు సముద్రాలను దాటిన మానవుడు, రోదసీ జయించిన మానవుడు... తన
మూఢనమ్మకాలను తనే వదిలించుకోక పోవడం విచారకరం.
దేవుడు లేడు, లేడు,
లేడు.. అని ఘంటాపథంగా చెప్పిన పెరియర్ ఒక మాట చెప్పాడు. ''నీ బుద్ధి పని
చేయడం ప్రారంభిస్తే అక్కడ భక్తి నిలవదు. నీ బుద్ధి బద్ధకిస్తే, అక్కడ నీ
మీద భక్తి పెత్తనం చేస్తుందీ అని!'' ఒకసారి ఒకతను పరియార్తో వాదులాటకు
దిగాడు. ''దేవుణ్ణి రాయిగా తేల్చేయకండి! అదిప్పుడు రాయి కాదు,
మంత్రోచ్ఛారణతో దాన్ని దేవుణ్ణి చేశాం'' అని అన్నాడు. ''రాయినే దేవుణ్ణి
చేయగల శక్తిగలవారు కదా? అట్టడుగు వర్ణాల వారిని మంత్రోచ్ఛారణతో అగ్రవర్ణాల
వారిగా చేయండి! మనుషులంతా సమానులై సమస్యలు లేకుండా పోతాయి కదా?'' అని
ప్రశ్నించాడు పెరియార్! ఆనాటి ఆయన ప్రశ్నకి ఈనాటికీ జవాబు లేదు. హిందూమతం
గూర్చి ప్రపంచానికి మహోపన్యాసం ఇచ్చిన వివేకానందుడే ఆ తర్వాతి కాలంలో
ఏమన్నాడో పరిశీలించండి. ''ఏ హేతు పరిశీలన వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి
విజ్ఞాన శాస్త్రాన్ని రుజువు చెయ్యడానికి కారణభూతాలవుతున్నాయో, వాటి
సహాయంతో మతమూ నిరూపించబడాలా? అంటే అవుననే నా అభిప్రాయం! ఈ పని ఎంత త్వరగా
జరిగితే అంత మంచిది. ఒకవేళ అలాంటి పరిశోధనల వల్ల మతం నశించే పక్షంలో
ఇంతకాలంగా అది నిష్ప్రయోజనమైందని, అనుచితమైన అంధవిశ్వాసమని తెలుస్తూ ఉంది.
కాబట్టి, అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని
మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం! పనికి మాలిందంతా పోతుందనడం
నిస్సందేహం.''
ఒకప్పుడు దైవభావనకు మహిమలు ఆపాదించినట్టే, ఇప్పుడు
వ్యాపార సినిమా హీరోలకి సాహసాలు ఆపాదించి జనం ఆనందిస్తున్నారు. ఊహలు,
అబద్దాలు జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. నిజాలు, వాస్తవాలు కటువుగానే
ఉంటాయి. మనకు తెలుసు, వాస్తవానికి నటీనటులు సాహసవంతులు కారు. సామాన్యులు
చేయగలిగే పనులు కూడా వారు చేయలేరు. ఉదాహరణకు వందల కిలోల బరువు మోయగలిగే
హమాలీలున్నారు. మండుటెండలో 20 కి.మీ. రిక్షా తొక్కేవాళ్ళున్నారు. ఐదారు
కి.మీ. మంచినీళ్ళ బిందెలు మోసే గృహిణులున్నారు. నటన కాదు, తప్పని సరై
వాళ్ళలా చేస్తున్నారు. ఇవన్నీ మన కమర్షియల్ సినీ హీరో, హీరోయిన్లు
చేయగలరా? చేయలేరు. అలా ఒళ్ళు హూనం చేసుకుని బతికేవాళ్ళు కాసేపు వెండి
తెరమీద ఊహలు, భ్రమలు, అబద్దాలు చూసి ఆనందిస్తారు. ఇదే విధంగా తాము చేయలేని
పనులు తాము కల్పించుకున్న భగవంతుడు అవలీలగా చేస్తాడని జనం నమ్మారు. ఇంకా
నమ్ముతూనే ఉన్నారు. ఆ భావన నిలవడానికి అనాదిగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే
వచ్చారు. కథలో, నవలల్లో కల్పిత పాత్రలు పాఠకుల్ని ఏదో ఊహా ప్రపంచంలోకి
తీసుకుపోతాయి కదా? ఈ దైవభావన అంతే అని అర్థం చేసుకోవాలి!
ఎంత చదివారు?
ఎంత ఎదిగారు? ఎన్నికోట్లు కూడబెట్టారు? ఎన్ని మేడలు కట్టుకున్నారు? ఎంతటి
ఖరీదైన కార్లలో తిరిగారూ ఇవి ముఖ్యం కాదు. కాస్త వివేకంతో కూడిన ఎదుగుదల,
కాస్త విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కావాలి. విచారించాల్సిన విషయమేమంటే
ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగాక అర్థం, పర్థం లేని మూఢత్వం బాగా
పెరుగుతోంది. బాబాలు, స్వామీజీలు, అమ్మలు, దద్దమ్మలు గంటల తరబడి టీవీల
ద్వారా ఇంటింటా అవివేకాన్ని, మూఢత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే
శాస్త్రీయమైన చదువు కావాలంటున్నాం. నిరూపణకు నిలబడనివి 'నమ్మకం' స్థాయిలో
ఉంటే భరించొచ్చు. కానీ అవి 'అమ్మకం' స్థాయికొచ్చేస్తున్నాయి. కాబట్టి
సామాన్య జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి పూజలు
చేయిస్తానని, పరమాన్నంలో మత్తుమందు కలిపి, 1.33 కోట్ల నగదు కాజేసిన ఒక బాబా
ఉదంతం హైదరాబాద్, బంజారాహిల్స్లో వెలుగులోకి వచ్చింది కదా? మోసాలు ఏ
స్థాయిలో ఉన్నాయనేది ఒకవైపున ఉంటే, ఇంగిత జ్ఞానం ఉపయోగించని ధనిక
మూర్ఖశిఖామణులు ఏ స్థాయిలో ఉన్నారనేది మరొక వైపున ఉందికదా?
ఏ మతమూ
శాంతికి స్వర్గధామం కాదు. హింసను ప్రోత్సహించే మౌలికాంశాలు ప్రతి మతంలోనూ
ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గతాన్ని తవ్వి చెప్పుకోనవసరం లేదు.
ఇంతెందుకూ? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం మతం నేపథ్యంలో
జరుగుతున్నదే కదా? అందువల్ల ఏ మతమూ నిర్దిష్టం కాదు. అన్నింటిలో
లోపాలున్నాయి. ఇది మెరుగైంది. ఇది స్వచ్ఛమైంది అని ఏ మతానికీ మొదటి స్థానం
ఇవ్వలేం. మనిషి కేంద్రంగా అతను సాధించిన విజయాలు కేంద్రకంగా చేసుకుని,
మానవతా వాదాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో తప్పకుండా మనం చాదస్తాల్ని, మూఢ
నమ్మకాల్ని వదిలేయ గలం. మత రహిత సమాజాన్ని ఏదో ఓ నాటికి రూపొందించుకోగలం!
వ్యాసకర్త ప్రముఖ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త, సెల్: 9908633949 డాక్టర్ దేవరాజు మహారాజు ( నవ తెలంగాణ సౌజన్యంతో)